byసూర్య | Mon, Sep 16, 2024, 04:21 PM
కులగణనతోనే రాష్ట్రంలో బలహీన వర్గాలకు పదవులు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంత రావు అన్నారు.సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే దేశంలో బలహీన వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలుస్తామని కొందరు బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఇప్పుడే మానుకోవాలని వీహెచ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతల్లో ఎవరికీ మైండ్ పనిచేయట్లేదని సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తరిమేసినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఫిరాయింపులు మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారని అన్నారు. అప్పుడు కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారు.. ఏం చేశారని వీహెచ్ ప్రశ్నించారు. అనంతరం కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.