byసూర్య | Mon, Jul 08, 2024, 09:54 PM
దంపతులు అన్నాక కలహాలు కామన్. ఏ కాపురంలోనైనా చిన్న చిన్న గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండవని అంటారు. ఓ 10 నిమిషాలు కూర్చుంటే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరకుతుంది. ఈ విషయాలను మరిచిపోతున్న కొందరు.. ఇటీవల కాలంలో చాలా సిల్లీ రీజన్స్కు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంత చిన్న విషయాలకు కూడా చనిపోతారా..? అనే విధంగా ఎంతో విలువైన ప్రాణాలను గాల్లో కలిపేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్లో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి చావు అంచుల దాక వెళ్లొచ్చాడు. మటన్ విషయంలో తలెత్తిన వివాదంలో నడుముకు బండరాళ్లు కట్టుకొని చెరువులో దూకాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్లో సాయిని నరేష్, రాణి దంపతులు గత కొంత కాలంగా నివాసముంటున్నారు. నరేష్ కారు డ్రైవర్గా పనిచేస్తుండగా.. రాణి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆదివారం ఉదయం నరేష్ మటన్ తీసుకొస్తానని ఇంట్లో రూ.1,000 తీసుకొని బయటకు వెళ్లాడు. అయితే మాసం వద్దని.. ఆ డబ్బులతో ఇంట్లోకి వస్తువులు కొంటానని రాణి చెప్పంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. క్షణికావేశానికి గురైన నరేష్ చనిపోతానంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.
బాచుపల్లిలోని భైరుని చెరువు వద్దకు చేరుకొని అందులో దూకి చనిపోయేందుకు డిసైడ్ అయ్యాడు. అయితే అతడికి ఈత వచ్చి ఉండటంతో.. ఎలాగైనా మునిగి చనిపోవాలని నడుముకు బండరాళ్లు కట్టుకుని చెరువులోకి దూకాడు. నరేష్ చెరువులోకి దూకటాన్ని గమనించిన స్థానికులు100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ సత్యపాల్ రెడ్డి చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరేష్ను బయటకు లాక్కొచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నరేష్, రాణి దంపతులకు ఎస్సై జి.సంధ్య పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇక ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. మటన్ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకోవటంపై పలువురు మండిపడుతున్నారు.