వర్షాకాలం ఎఫెక్ట్.. గ్రేటర్‌లో డెంగీ డేంజర్ బెల్స్‌.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

byసూర్య | Mon, Jul 08, 2024, 09:56 PM

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. అందులోనూ డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దోమ కాటు వల్ల ఈ జ్వరాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ బారిన పడి వందల మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 900 డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో సగానికి పైగా హైదరాబాద్‌ నగరంలోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో డెంగీ జ్వరం బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌కి ఎక్కువ మంది రోగులు జ్వరంతో డెంగీ పరీక్షల కోసం వస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో డెంగీకి కారణమయ్యే టైగర్‌ దోమ విజృంభిస్తోంది. ఈ టైగర్‌ దోమ కుట్టిన 3-4 రోజుల నుంచే వంటి నొప్పులతో మొదలై తీవ్ర జ్వరం, తలనొప్పి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. తొలి దశలో తీవ్ర జ్వరం, ఒంటిపై దద్దుర్లు ఉంటాయని అంటున్నారు. రెండో దశలో ప్లేట్‌లెట్లు తగ్గడం, బీపీ పడిపోవటం, కడుపులో నొప్పి, వాంతులు, కాలేయంపై ప్రభావం ఉంటుందని అంటున్నారు. రెండో దశలో లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌లో చేరాలని సూచిస్తున్నారు.


ఈ జాగ్రత్తలు తీసుకోండి..


వారం రోజులైన జ్వరం తగ్గకపోవటం, ఒంటిపై దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, రక్తస్రావం, కంటి వెనుక నొప్పి తదితర లక్షణాల్లో ఏవైనా రెండు, అంతకంటే ఎక్కువ కనిపించాయంటే.. దాన్ని డెంగీ జ్వరంగా అనుమానించాల్సిందే.


వెంటనే ఆసుపత్రికి వెళ్లి NS1 లేదంటే డెంగీ IGM టెస్టు చేయించుకోవాలి. టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే డెంగీ జ్వరం నిర్ధారణ అయినట్లే. వెంటనే కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వార శరీరంలో ప్లేట్‌లెట్లు సంఖ్య తెలుస్తుంది.


ఆరోగ్యంగా ఉండేవారిలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్‌లెట్లు ఉంటాయి. డెంగీ ఫీవర్ వచ్చిన వారిలో ఈ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. అలా తగ్గిన వారు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ కావాలి.


కొందరిలో ప్లేట్‌ లెట్లు క్రమంగా తగ్గుతున్నా.. రెండు, మూడు రోజులపాటు బయటకు లక్షణాలు ఏ మాత్రం కనిపించవు. అయితే అలాంటి రోగులకు శరీరంలో లోలోపల తీవ్ర రక్తస్రావం జరిగిపోతుంది. అలా జరిగినపుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి వారు కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సీబీపీ పరీక్ష ద్వారా ఎప్పటికప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్య తెలుసుకోవడం ఉత్తమం.


డెంగీ జర్వానికి ప్రస్తుతానికి కచ్చితమైన మందులంటూ లేవు. జ్వరం తగ్గటానికి పారాసిట్మాల్, ఇన్‌ఫెక్షన్లు రాకుండా యాంటీబయోటిక్స్, ఎలక్ట్రోలైడ్స్‌, ఐవీ ప్లూయిడ్స్ అందిస్తారు.


ఇక వీటితో పాటు మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కుండీలు, తాగేసిన కొబ్బరి బోండాలు, టైర్లు, ఉపయోగించని పాత్రలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.



Latest News
 

ప్రధాన రహదారిపై చిరుత పులి కలకలం Mon, Oct 28, 2024, 12:30 PM
సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు Mon, Oct 28, 2024, 12:26 PM
సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు Mon, Oct 28, 2024, 11:26 AM
తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.? Mon, Oct 28, 2024, 10:29 AM
అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM