byసూర్య | Mon, Jul 08, 2024, 10:57 PM
హైదరాబాద్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఫౌండేషన్ పేరుతో ఏకంగా 4 వేల మందికి కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా 514 కోట్లు స్వాహా చేశారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో ఈ మోసానికి తెరలేపారు. ఫౌండేషన్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ అమాయకుల్లో ఆశలు రేకెత్తించి.. భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. పెట్టుబడులు పెట్టిన వారికి అధిక వడ్డీతో పాటు ప్లాట్లు కూడా ఇస్తామని ధన్వంతరి ఫౌండేషన్ నిర్వాహకులు కమలాకర్ శర్మతో పాటు మిగిలిన వారు మభ్యపెట్టారు.అధిక వడ్డీతో పాటు ప్లాట్లు కూడా ఇస్తారనేసరికి.. టెంప్ట్ అయిన బాధితులు దాచుకున్న డబ్బును మొత్తం పెట్టుబడుల రూపంలో పెట్టేశారు. ఇలా దాదాపు 4 వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు సమాచారం. ఇందులో మోసపోయిన బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం. అయితే.. పెట్టుబడులకు వడ్డీలు ఇవ్వట్లేదు.. అలా అని ప్లాట్ల మాట కూడా ఎత్తకపోవటంతో.. బాధితులకు అనుమానాలు తలెత్తాయి.
దీంతో.. బాధితులందరూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి.. కమలాకర్ శర్మను అరెస్ట్ చేసి ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సీసీఎస్కు అటాచ్ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని డీసీపీ శ్వేతారెడ్డి హామీ ఇచ్చారు.
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఎప్పటి నుంచో పెట్టుబడులు పెడుతున్నామని.. కానీ వడ్డీలు చెల్లించడం లేదని బాధితులు తెలిపారు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నిస్తే సరిగ్గా స్పందించట్లేదన్నారు. ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో అధిక వడ్డీలు ఇస్తున్నారని ప్రచారం చేయడంతో చాలా మంది పెట్టుబడి పెట్టారన్నారు. ఆఫీసు చుట్టు తిరిగితే ఇవాళ, రేపు చెల్లిస్తామంటూ చివరికి మోసం చేశారని బాధితులు వాపోయారు.
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చెప్పిన విషయాలు నమ్మి.. బ్యాంకులో కన్నా ఈ సంస్థలో అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో పెట్టుబడులు పెట్టామని బాధితులు చెప్పుకొచ్చారు. ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్తూ ఏడాది పాటు ఆగాలని.. తమకు వడ్డీలు చెల్లించలేదన్నారు. ఇందులో దాదాపుగా 4 వేల మంది బాధితులు ఉన్నారని.. ఈ విషయంలో సీసీఎస్ డీసీపీ శ్వేతారెడ్డి తప్పకుండా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెప్పుకొచ్చారు.