byసూర్య | Tue, Jun 18, 2024, 07:37 PM
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులను పోలీసులు అరెస్ట్ చేసిన విచారించగా.. ప్రధాన నిందితునిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసినట్టు గుర్తించిన సిట్ అధికారులు.. కీలకమైన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్ఐబీకి టెక్నాలజీని అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్లో పలు హార్డ్ డిస్క్లు అధికారులు సీజ్ చేశారు. 3 సర్వర్లు, 5 మినీ డివైసెస్తో పాటు హార్డ్ డిస్క్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నోవేషన్ ల్యాబ్ ఛైర్మన్ రవి కుమార్ నివాసం, కార్యాలయంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో.. రవికుమార్ ఇంట్లో దాచిపెట్టిన హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు 3 జిల్లాల్లో ఇన్నోవేషన్ ల్యాబ్ తన కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. మినీ కంట్రోల్ రూంల ఏర్పాటు చేయటంలో రవి కుమార్ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలతో పాటు ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయటంలో రవి కుమార్ కీలకపాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఐబీకి గత కొంతకాలంగా ఇన్నోవేషన్ ల్యాబ్ టెక్నికల్ సపోర్టు అందిస్తుండగా.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీతరావు.. రవి కుమార్ సహకారం తీసుకున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు.
దీంతో.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే.. ఆ హర్డ్ డిస్కుల్లో ఎలాంటి సమాచారం ఉందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్కు సమంబంధించి వివరాలు ఉన్నాయా.. లేదా ఫోన్ సంభాషణలు ఉన్నాయా.. అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.