byసూర్య | Sun, Jun 16, 2024, 05:38 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఓఆర్ఆర్ సమీపంలో అనుమానస్పదస్థితిలో మృతి చెందిన బాలుడి మిస్టరీ వీడింది. తల్లే బాలుడిని హత్య చేసినట్లు తేలింది. ప్రవర్తన సరిగా లేదని మందలించటంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి పోలీసులకు చిక్కింది. ఈ కేసులో మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు పక్కన ఈనెల 11న ఉదయం ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయి ఉన్నాడు. స్థానికులు బాలుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని బాలుడి మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివరాల కోసం బాలుడి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఫోటో వైరల్ కాగా.. పాత రామచంద్రాపురానికి చెందిన బాలుడు విష్ణువర్ధన్గా గుర్తించారు. దీంతో పోలీసులు బాలుడి ఇంటికెళ్లి చూడగా తాళం వేసి ఉండటాన్ని గమనించారు.
స్థానికులను అడగి చూడగా.. బాలుడి తండ్రి కుమార్ ఏడాది క్రితం చనిపోయాడని.. తల్లి స్వాతి వద్దే బాబు ఉంటున్నాడని తెలిపారు. కుమారుడు చనిపోయినా.. తల్లి ఇంటి వద్ద లేకపోవడం, స్పందించకపోవటంతో పోలీసులు ఆమెపై నిఘా ఉంచారు. ఈనెల 14న ఆమెను పట్టుకొని విచారణ చేయగా.. తానే కుమారుడిని చంపినట్లు చెప్పింది. ఈనెల 10న తనను దుర్భాషలాడటంతో మద్యం మత్తులో గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశానని చెప్పింది. తాను సహజీవనం చేస్తున్న ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన అనిల్ను కూడా విష్ణువర్ధన్ సూసైడ్ చేసుకున్నాడనే నమ్మించింది.
స్వగ్రామం కామారెడ్డి జిల్లా పుల్కంపేట గ్రామానికి బాలుడి మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి మృతదేహాన్ని తీసుకురావద్దని బంధువులు చెప్పారు. దీంతో ఏం చేయాలో తోచక అనిల్తో కలిసి బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లి ముత్తంగి ఓఆర్ఆర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో స్వాతితో పాటు రెండో భర్త అనిల్ను అరెస్టు చేశారు.