byసూర్య | Sun, Jun 16, 2024, 05:39 PM
నైరుతి రుతపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్లలో వర్షం కురుస్తే.. ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం, శ్రీధర్బాబులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం అధికారులకు పలు సూచలను చేశారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్లో ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని.. సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను వెంటనే రిక్రూట్ చేసుకోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలలన్నారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు వివరించగా.. వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టంతో పాటు నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు.