byసూర్య | Sun, Jun 16, 2024, 05:40 PM
తెలంగాణలో భూముల ధరల పెంపునకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల మార్కెట్ వాస్తవ ధరకు.. ప్రభుత్వ ధరకు వ్యత్యాసం ఉండటంతో మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు రేవంత్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
అందులో భాగంగా.. క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. పాత మార్కెట్ విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఈ శాఖ అధికారులు ప్రైమరీ మీటింగ్ నిర్వహించి కార్యక్రమాన్ని షురూ చేయనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఫైనల్ చేయనున్నారు. ఆ తర్వాత పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని ఈ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను ముందుగా గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్లు తదితర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా బహిరంగ భూముల ధరలను లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువను సవరిస్తారు. వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరలపై అధికారులు అంచనాకు వస్తారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే.. పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో స్థానిక ప్రాంతాలను ఆధారంగా చేసుకొని విలువను నిర్ధారిస్తారు. కమర్షియల్ ఏరియాలు, మెయిన్ రోడ్స్ లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వసతులు- అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు. పురపాలక, నగర పాలక సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరల ఆధారంగా సవరణ చేస్తారు.
ఈనెల 23 వరకు మార్కె్ట్ విలువల సవరణ పూర్తి చేయనుండగా.. జూన్ 29 నాటికి కమిటీ ఆమోదం వేయనుంది. ఆ తర్వాత జులై 20 వరకు సలహాలు, సూచనలు, అభ్యంతరాల స్వీకరణ తీసుకొని వాటికి పరిష్కారం చూపనున్నారు. సవరించిన ధరలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.