byసూర్య | Sun, Jun 16, 2024, 05:41 PM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ యాక్షన్లోకి దిగారు. తొలిసారిగా.. కేంద్ర మంత్రి హోదాలో మెదక్ అల్లర్ల విషయంలో స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మెదక్లోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంశాతిని నెలకొల్పేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. అమాయకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కేసులు పెట్టొద్దని ఆదేశించారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు.
శనివారం (జూన 15వ తేదీన) రాత్రి మెదక్ పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంతువధ, గోవుల తరలింపు విషయంలో తలెత్తిన ఘర్షణలో.. రెండు వర్గాలు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి గాయాలయ్యాయి. దీంతో.. మెదక్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా కొద్ది సేపటివరకు పరిస్థితి అదుపులోకి రాకపోవటం గమనార్హం. అయితే.. తీవ్రంగా శ్రమించిన పోలీసులు.. మొత్తానికి ఘర్షణ వాతావరణాన్ని చల్లబడేలా చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మెదక్లో భారీగా పోలీసులను మోహరించారు. అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ఇవాళ మెదక్ బంద్కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మెదక్ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుండా పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపగా.. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.