byసూర్య | Wed, May 29, 2024, 07:51 PM
ఇది టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న యుగం. మనుషులు చేసే చాలా పనులు చాలా వరకు రోబోలు, మిషన్లు చేసేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏ I) సాంకేతికత హవా నడుస్తోంది. ప్రతి పనిలోనూ ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటున్నాం. ఇటీవల ఐఏ యాంకర్లతో వార్తలు చదివించిన వాటి గురించి విన్నాం.. చూశాం. తాజాగా.. ఓ గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్ వినూత్నంగా ఆలోచించి ఏఐ సాకేంతకను ఉపయోగించి కొత్త అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా వీడియో రూపొందించారు. కరీంనగర్ జిల్లా వట్టెంల జెడ్పీహెచ్ఎస్ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ వీడియోను తయారు చేయించారు.
'తల్లిదండ్రులారా ఆలోచించండి..' అంటూ ఏఐ యాంకర్తో ప్రత్యేకంగా వీడియో రూపొందించి తమ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలని కోరుతున్నారు. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు అందిస్తామని.. డిజిటల్ విద్యా భోదన, కంప్యూటర్ విద్య ఉచితంగా లభించేలా చర్యలు తీసుకంటామన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సంపూర్ణ వికాసంతో కూడిన మీ పిల్లల భవిష్యత్తుకు తమ స్కూల్ నిలయమని చెప్పారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన. కంప్యూటర్ విద్యా, టీవీల ద్వారా డిజిటిల్ విద్యాభోదన, ఆటల్లో ప్రత్యేక శిక్షణ, రుచికరమైన, బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం. ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు రెండు జతల యూనిఫాంలు ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. తమ స్కూల్లో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏఐ యాంకర్ ద్వారా చెప్పించారు.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెడ్ మాస్టర్ ఐడియా సూపర్ అంటూ నెటిజన్లు కొనియాడాతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆడ్మిషన్ల కోసం లక్షలు ఖర్చు చేసి యాడ్లు చేయిస్తుంటారని.. ఈ ప్రభుత్వ స్కూల్ హెడ్మాస్టర్ పైసా ఖర్చు లేకుండా సింపుల్గా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొత్త అడ్మిషన్ల కోసం వీడియో రూపొందించిన తీరు ప్రశంసనీయమని కామెంట్లు పెడుతున్నారు.