టవల్స్‌తో చెక్‌పోస్టులోకి ఎంట్రీ.. లారీడ్రైవర్లుగా అనుకున్న సిబ్బంది.. తీరా తెలిసి

byసూర్య | Tue, May 28, 2024, 08:11 PM

అది తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉండే చెక్‌పోస్ట్. నిత్యం వాహనాల రాకపోకలతో బిజీబిజీగా ఉంటుంది. లారీలు, కార్లు.. ఇలా ఒక్కటేమిటీ క్షణం తీరికలేకుండా వాహనాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. మంగళవారం కూడా అదే పరిస్థితి. ఇక చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఆర్టీఏ అధికారులు ఎప్పటిలాగే తమ పనుల్లో తాము చాలా బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో చెక్ పోస్ట్ వద్దకు కొంతమంది భుజాన రుమాళ్లు వేసుకుని వచ్చారు. మిగతా డ్రైవర్లతో పాటుగా అక్కడ క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అక్కడున్న అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. తమకు అలవాటైన రీతిలో తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చినవారు ఎవరో తెలిసి విస్తుపోయారు.


శాఖలు, డిపార్టమెంట్లతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాల్లో తిష్టవేసిన మహమ్మారి లంచం. అందరినీ అని చెప్పలేం కానీ.. ప్రభుత్వ అధికారులు లంచం లేకుండా పనిచేయరనే అభిప్రాయం ప్రజల్లో ఉండిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో మార్పు వస్తోంది. తెలంగాణ అవినీతి నిరోధకశాఖ నిత్యం తనిఖీలు జరుపుతూ.. లంచం తీసుకునే ఉద్యోగుల భరతం పడుతోంది. తాజాగా రవాణా శాఖపై కన్నేసిన ఏసీబీ.. తెలంగాణలోని పలు ఆర్టీవో కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉన్న చెక్‌‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఇందుకోసం వారు ఏకంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు.


ఖమ్మం ఏసీబీ డీఎస్సీ రమేష్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాలు వేసుకుని అశ్వారావుపేట చెక్ పోస్టుకు వెళ్లారు. వచ్చింది లారీ డ్రైవర్లే అనుకుని చెక్‌పోస్టు సిబ్బంది వారిని పట్టించుకోకుండా తమ పనుల్లో తాము పడిపోయారు. అయితే అక్కడి తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన ఏసీబీ.. సిబ్బంది టైర్ల ప్రకారం వాహనాలకు రేట్లు ఫిక్స్ చేస్తూ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రూ.35వేల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.


మరోవైపు చెక్ పోస్ట్ గురించి గతంలో అనేకసార్లు ఫిర్యాదులు వచ్యాయని.. అందుకే ఈ ఆపరేషన్ చేసినట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. లారీ డ్రైవర్ల నుంచి ఆర్టీఏ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. దీంతోనే తాము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. లారీ డ్రైవర్ల నుంచి టైర్ల ప్రకారం వసూలు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. రికార్డుల్లో చూపని అనధికార నగదు 35 వేలు సీజ్ చేశామని.. చెక్‌‌పోస్టులో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డితో పాటు మరో ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM