byసూర్య | Fri, Oct 18, 2024, 03:17 PM
మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు.మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్కు వెళ్దామని సవాల్ విసిరారు. స్వయంగా నేనే కారు డ్రైవింగ్ చేస్తా.. నా పక్కన కూర్చో.. ఇద్దరం కలిసి వెళ్దామన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు తాను సిద్ధంగా ఉంటానని చెప్పారు. ముందు మూసీ బాధితుల దగ్గరకు వెళ్దామని, ఆ తర్వాత మల్లన్న సాగర్కు వెళ్దామన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్తో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం స్థాయిని దిగజార్చారని చెప్పారు.
కేసీఆర్ హయాంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైందన్నారు. మూసీలోకి వ్యర్థాలను తరలించే పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలనుకున్నామని తెలిపారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉదంని చెప్పారు. మూసీ పునరుజ్జీవం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. మూసీ పునరుజ్జీవం అని చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పేదల ఇండ్లు కూలగొట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రివర్ ఫ్రంట్ ఏంటి, దాని వెనుక ఉన్న స్టంట్ ఏంటని ప్రశ్నించారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.