byసూర్య | Tue, May 28, 2024, 08:07 PM
హైదరాబాద్ నగరవాసులకు విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఉండనున్నాయని చెప్పారు. నిర్వహణ పనుల కారణంగా ఈ కోతలు ఉంటాయన్నారు. ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించిన సంగతి తెలసిందే. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలపై పడిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి.
పెరిగిన కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్లో ఇవాళ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తామని, విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయిస్తామని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కరెంటు కోతలు ఉంటాయని చెప్పారు. ఒక్కో ఫీడర్ ఏరియాలో ఎన్ని గంటలు పవర్ కట్ ఉంటుందనేది అధికారులు పూర్తి వెల్లడించారు.
ప్రాంతాల వారీగా షెడ్యూల్:
ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు 11 కేవీ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫీడర్ ఆఫ్ చేయబడుతుంది. దీంతో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏరియా, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏరియా, సుజాత స్కూల్ ఏరియా, మెడ్విన్ హాస్పిటల్ ఏరియా, చాపల్ రోడ్ ఏరియాలోని విజయా బ్యాంక్, మహేష్ నగర్ ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటాయి.
మధ్యాహ్నం 12:30 నుండి 2:00 వరకు 11 కేవీ బాబుఖాన్ ఎస్టేట్ ఫీడర్ బంద్ చేస్తారు. ఈ సమయంలో బాబూఖాన్ ఎస్టేట్ ప్రాంతం, ఎల్బీ స్టేడియం రోడ్డు, హెచ్ పీ పెట్రోల్ పంపు ప్రాంతం, కమిషనర్ కార్యాలయం, నిజాం హాస్టల్ ప్రాంతం, జగదాంబ జ్యువెలర్స్ భవనం తదితర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయి. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 4:30 వరకు 11 కేవీ ఏపీ టూరిజం ఫీడర్ ఆఫ్లో ఉంటుంది. దీంతో అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ప్రాంతం, ఆయిల్ సీడ్స్ క్వార్టర్స్ ప్రాంతం, లిబర్టీ పెట్రోల్ పంప్ ప్రాంతం, స్టాంజా భవనం , దాదుస్ స్వీట్ షాప్ ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటాయని చెప్పారు.