byసూర్య | Tue, May 28, 2024, 07:53 PM
ఇటీవల హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖ హోటళ్లలోనూ నాణ్యతలేని.. కుళ్లిపోయిన వస్తువులతో ఆహారపదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాసుల కోసం కక్కుర్తి పడుతూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్లు వెల్లడించారు. అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నా.. కొందరు హోటల్ నిర్వాహకుల్లో మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న కుటుంబం మెుత్తం అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. రూ. 1000 పెట్టి బిర్యానీ తిన్న పాపానికి ఆసుపత్రిలో రూ. లక్షకు పైగా ఖర్చయింది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు సందర్భంగా ఈనెల 22నన షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లారు. మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న కాసేపటికే ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు, విరేఛనాలు అయ్యాయి. దీంతో నరేందర్తో పాటు అతని భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరుధ్, అభిలాష్, జోష్ణ, సాయి శ్రీకర్ మెుత్తం 8 మందిని శంషాబాద్లోని ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వారికి అక్కడే చికిత్స అందుతోంది. పెళ్లిరోజు ఉంది కదా అని రూ. 1000 ఖర్చు చేసి బిర్యానీ తింటే.. ఆసుపత్రిలో రూ. లక్ష ఖర్చయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సంబంధిత అధికారులు షాద్నగర్ పట్టణంలోని హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేసి పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.