byసూర్య | Tue, May 28, 2024, 07:40 PM
హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు మంగళవారం ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్లో ఎక్కడా బాంబు దొరకకపోవడంతో అది ఫేక్ కాల్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
ఫేక్ ఫోన్ కాల్పై మంత్రి సీతక్క స్పందించారు. తాము ప్రజలకు స్వేచ్ఛగా ప్రజాభవన్లోకి వచ్చే అవకాశం ఇస్తే ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవైరనా రావొచ్చని తాము ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నామని అన్నారు. కొందరు కావాలనే ఇలాంటి కాల్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తాము కష్టాలను చెప్పుకునేందుకు ప్రజాభవన్లోకి అందర్నీ అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చెకింగ్ జరుగుతోందని.. వాస్తవాలు తెలుస్తాయని సీతక్క వ్యాఖ్యానించారు.
కాగా, గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రగతి భవన్ను నిర్మించారు. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కొనసాగుతోంది. అలాగే ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.