గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు

byసూర్య | Fri, Apr 26, 2024, 08:37 PM

అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. అయిదు నెలల్లోనే ఎదుర్కోబోయే లోక్‌సభ పోరు ప్రతిష్ఠాత్మకం కావడంతో హోరాహోరీకి సిద్ధమైంది. ఇక శాసనసభ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ తన సత్తాను నిరూపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. శాసనసభ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ.. లోక్‌సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది. ఇలా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదను పెడుతున్నారు.


అయితే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 2004లో జరిగిన ఎన్నికల్లో కె. చంద్రశేఖర్ రావు సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలకు పోటీచేసి.. రెండుచోట్లా విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడి నుంచి హరీశ్‌రావు గెలుపొందారు.


కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కేసీఆర్‌ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ 2006, 2008 సంవత్సరాల్లో రెండుసార్లు రాజీనామా చేసి కరీంనగర్‌ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక్కడ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి అసెంబ్లీకి, మెదక్‌ నుంచి పార్లమెంటుకు కేసీఆర్‌ పోటీచేసి రెండింటా గెలుపు సొంతం చేసుకున్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మెదక్‌ ఎంపీ పదవికి ఆయన రాజీమానా చేయగా... అనంతరం అదే పార్టీకి చెందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి అక్కడి ఎంపీగా గెలుపొందారు. ఇవే ఎన్నికల్లో కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా నిజామాబాద్‌ ఎంపీగా విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేయకపోయినా.. కవిత మాత్రం నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. 2022లో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనే ఆసక్తి తొలినాళ్లలో నెలకొంది.


నిజామాబాద్‌ నుంచి తిరిగి కవితను పోటీ చేయించడం లేదనే సంకేతాలను పార్టీ ముందునుంచే ఇచ్చింది. ఒకవేళ పోటీ చేయాలని కవిత పట్టుపడదామనుకున్నా నెలరోజుల క్రితమే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఆమెను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచింది. మరోవైపు మెదక్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. అక్కడి నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి టికెట్‌ ఖరారు చేశారు. మల్కాజిగిరి నుంచి కేటీఆర్‌ను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలపాలని పార్టీ చర్చించినట్లు ప్రచారం జరిగినా.. ఎంపీగా పోటీ చేయడానికి కేటీఆర్‌ అంతగా ఆసక్తి చూపకపోవడంతో రాగిడి లక్ష్మారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. మొత్తంగా పార్టీ ఆవిర్భవించిన 23 ఏళ్ల తర్వాత కేసీఆర్‌ కుటుంబం లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉండటం గమనార్హం.


Latest News
 

బూరుగుపల్లి వరకు భారీ వాహన ర్యాలీ Tue, May 07, 2024, 10:48 AM
హత్నూర మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రచారం Tue, May 07, 2024, 10:47 AM
ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ కనుమరుగు: జూపల్లి Tue, May 07, 2024, 10:46 AM
వందే భారత్ రైలు కింద పడి చనిపోయాడు Tue, May 07, 2024, 10:45 AM
రేవంత్ లక్కీ సీఎం: డీకే అరుణ Tue, May 07, 2024, 10:22 AM