byసూర్య | Fri, Apr 26, 2024, 07:39 PM
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన మాటలు, డైలాగులే కాదు.. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండింగే. పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ అసెంబ్లీలో మల్లారెడ్డి చేసిన ఓ ప్రసంగం ఆయనను సోషల్ మీడియాలో సంచలనంగా మార్చేసింది. మల్లారెడ్డి మైకు పట్టుకున్నాడంటే.. అదిరిపోయే డైలాగులు విసురుతూ సభలో ఉన్నవాళ్లలో ఉత్సాహం నింపటమే కాదు.. నెటిజన్లకు కూడా మంచి స్టఫ్ ఇస్తుంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాదు.. ఎన్నికల సమయంలోనూ వైరైటీ ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికల తర్వాత కూడా తన కార్పోరేటర్లందరినీ.. గోవా, దుబాయ్ టూర్లకు తీసుకెళ్లి ఫుల్ చిల్ అవుతూ వార్తల్లో నిలిచారు మల్లారెడ్డి.
కాగా.. ఇప్పుడు ఓ సంచలన ప్రకటన చేసి మరోసారి చర్చనీయాంశంగా మారారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఈటల రాజేందర్.. విజయం సాధిస్తారంటూ బహిరంగంగా ప్రకటించారు. హైదరాబాద్ కొంపెల్లిలోని కేఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఓ వేడుకకు ఈటల రాజేందర్ హాజరుకాగా.. అదే ఫంక్షన్కు మల్లారెడ్డి కూడా వెళ్లారు. అక్కడ ఈటల రాజేందర్ను చూసిన మల్లారెడ్డి.. ఈటలను ఆప్యాయంగా పలకరించారు. దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు.
ఈటలతో ఓ ఫొటో తీయాలంటూ కోరారు. మళ్లీ ఎప్పుడు కలుసుకుంటానో ఏమో అంటూ ఫోటో తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుందని ఈటల అడగటంతో.. మరో మాట చెప్పకుండా డైరెక్టుగా.. నువ్వే గెలుస్తావన్నా.. అంటూ ఎంతో ప్రేమగా చెప్పారు మల్లారెడ్డి. ఈ మాటతో అక్కడున్న వాళ్లందరి ముఖాల్లో నవ్వులు విరబూశాయి.
మేడ్చల్లో ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ఉండగా.. మల్కాజిగిరిలో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. లోక్ సభ ఎన్నికల్లో ఆయన కుమారున్ని బరిలో దింపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కాగా.. బీఆర్ఎస్ అధిష్ఠానం మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. అయితే.. రెండు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండగా.. ఎంపీ మాత్రం ఈటలే గెలుస్తాడని మల్లారెడ్డి అనటం వెనుక మర్మం ఏమైనా ఉందా.. లేదా మాటవరుసకు ఏమైనా అన్నారా అన్నది మల్లన్నకే ఎరుక.