byసూర్య | Wed, Apr 24, 2024, 08:49 PM
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పథకం తర్వాత బస్సులో సీటు కోసం ఆడాళ్లు కొట్టుకునే ఘటనలు చాలానే వెలుగు చూశాయి. జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్న వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా భార్యల సీట్ల కోసం.. భర్తలు కొట్టుకున్నారు. చెప్పులతో ఒకర్నొకరు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తొర్రూరు డిపోకు చెందిన ఎక్స్స్రెస్ బస్సు తొర్రూరు నుంచి ఉప్పల్ క్రాస్రోడ్డుకు వెళ్లేందుకు స్థానిక బస్టాండ్లో మంగళవారం సాయంత్రం వేచి ఉంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో కర్చీఫ్లు వేసి సీట్లు ఆపుకున్నారు. అయితే బస్సులోకి ఎక్కాక వేరే ప్రయాణికులు కూర్చోవడంతో సీటు మేము ఆపామంటే మేము ఆపామని ఇద్దరు మహిళా ప్రయాణికులు గొడవకు దిగారు. ఇది గమనించిన వారి భర్తలు ఒకరిపై ఒకరు చెప్పులతో బస్సులోనే దాడి చేసుకున్నారు. ఇక తోటి ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.
భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వారిని కిందకు దింపారు. కిందకు దిగినా దాడి ఆపలేదు. మరోసారి ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది 100కు డయల్ చేయడంతో పోలీసులు వచ్చి ఇరువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్గా మారింది.