వరంగల్‌లో ఎయిర్‌పోర్టు.. ఏఏఐ ప్రాథమిక సర్వే, త్వరలోనే అందుబాటులోకి

byసూర్య | Mon, Apr 22, 2024, 08:57 PM

వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. మామునూరులో ఉన్న పురాతన ఎయిర్‌ స్ట్రిప్‌ స్థానంలో దీనిని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయ నిర్మాణానికై ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI) కసరత్తు చేపట్టింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించటంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన హెలికాప్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించాయి.


తెలంగాణలో ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించింది. మామునూరు (వరంగల్‌), జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌), ఆదిలాబాద్‌, బసంత్‌నగర్‌ (పెద్దపల్లి), కొత్తగూడెం, గుడిబండ (మహబూబ్‌నగర్‌)లను ప్రతిపాదించింది.ఆ మేరకు 2019లో ఏఏఐ ప్రాథమిక అధ్యయనం నిర్వహించి ఆరింటి నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే పౌర విమానయాన శాఖ–రాష్ట్రప్రభుత్వం మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో జాప్యం జరుగుతూ వస్తోంది. వరంగల్‌ ఎయిర్‌పోర్టును తొలుత చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వరంగల్‌ ఎయిర్‌ స్ట్రిప్‌ పరిధిలో 706 ఎకరాలు ఉంది. ప్రాంతీయ విమానాశ్రయంగా తొలిదశ అభివృద్ధికి కనీసం 400 ఎకరాలు కావాలని ఏఏఐ పేర్కొంది. అందులో భాగంగా 253 ఎకరాలు కేటాయిస్తూ గతేడాది ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


హైదరాబాద్‌లోని జీఎమ్మార్‌ విమానాశ్రయంతోపాటు రక్షణ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం సందర్భంగా 150 కిలోమీటర్ల పరిధిలో మరోటి అభివృద్ధి చేయకూడదన్న నిబంధన ఉండటంతో ముందస్తు అనుమతి అనివార్యమైంది. వరంగల్ ఎయిర్‌పోర్టు శంషాబాద్‌లోని జీఎమ్మార్‌ విమానాశ్రయానికి 145 కిలోమీటర్ల వైమానిక దూరంలో ఉంది. విజయవాడ సమీపంలోని గన్నవరానికి 200, నాగ్‌పుర్‌కు 357, విశాఖపట్నంకు 385 కిలోమీటర్ల దూరంలో ఉంది.


దశాబ్దాల కిందటే వరంగల్‌లో ఎయిర్‌ ఫీల్డును నిర్మించారు. అత్యవసర పరిస్థితుల్లో, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అథారిటీ పైలట్ల శిక్షణ కోసం దాన్ని వినియోగిస్తున్నారు. ఇటీవల ప్రధాని పర్యటన సందర్భంగా ఆ ఎయిర్‌ ఫీల్డునే అధికారులు ఉపయోగించారు. ప్రస్తుతం ఎయిర్‌స్ట్రిప్‌లో 1400 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాని పక్కనే గ్లైడర్స్‌ దిగేందుకు అప్పట్లో మరో చిన్న రన్‌వే నిర్మించారు. ఇప్పుడు 2300 మీటర్ల పొడవుతో ఒకటే రన్‌వే కొత్త విమానాశ్రయం కోసం సిద్ధం చేయనున్నారు. రన్‌వే విస్తరణ, టెర్మినల్‌ భవనం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సర్వీసెస్‌కు ఈ అదనపు భూమి అవసరమవుతోంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది క్వార్టర్లను మరో చోట నిర్మించాలని నిర్ణయించారు. భూమిని సేకరించి అథారిటీకి అప్పగించిన ఏడాదిన్నరలోగా విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM