byసూర్య | Mon, Apr 22, 2024, 07:58 PM
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. తాజాగా.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్పాట్లోనే దంపతులు చెందారు. మృతులు సామినేని నవీన్ రాజా (29) సామినేని భార్గవి (24)గా గుర్తించారు.
వీరికి వివాహమై రెండు సంవత్సరాలు అవుతోంది. నవీన్ రాజా విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వారాంతంలో హైదరాబాద్ వచ్చిన వీరు.. నగరం నుంచి విజయవాడకు వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది. కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లటంతో రెండు గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం శవ పరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు లారీ కిందకు పూర్తిగా దూసుకెళ్లటం చూస్తే.. అది ఎంత వేగంగా దూసుకొచ్చిందో అర్థం అవుతుంది. ఒళ్లుగగుర్పాటుకు గురిచేసేలా ఈ యాక్సిడెంట్ ఘోరంగా జరిగింది. కారు ప్రమాద తీవ్రత చూస్తే అందులో ప్రయాణించేవారు బతికే అవకాశం లేదని ఇట్టే అర్థమైపోతుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.