byసూర్య | Mon, Apr 22, 2024, 07:55 PM
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు ప్రస్తుతం ప్రతీ ఒక్కటి కల్తీ చేస్తున్నారు. స్వచ్చమైన ఉత్పత్తులు దొరకటం చాలా కష్టమైపోయింది. ఇక నగరాల్లో అయితే చెప్పాల్సిన పనేలేదు. ఏదీ స్వచ్చంగా దొరకదు. కానీ ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. నగరవాసులకు కొంతలో కొంతనై స్వచ్చమైన ఉత్పత్తులు అందనున్నాయి. గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ని బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వారు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాల్లో దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజలకు దగ్గర్లో ఉండే డీ మార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ ఔట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రస్తుతం జీసీసీ ఆధ్వర్యంలో స్వచ్ఛమైన తేనె, షాంపూలు, సబ్బులు ప్రధానంగా అమ్ముతున్నారు. వాటిలో గిరి గోల్డ్ పేరుతో అలోవెరా, ఆరెంజ్, బొప్పాయి, పసుపు ఫ్లేవర్లో 4 రకాల్లో సబ్బులు ఉండగా కుంకుడుకాయలు, అలోవెరా షాంపూలు, టీఎస్ గిరిజన హనీ పేరుతో తేనెను విక్రయిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండడంతో ప్రజలు ఎక్కువగా కొంటున్నారు.
ఈ ఉత్పత్తులు హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో చాలా తక్కువ చోట్ల దొరుకుతున్నాయి. అయితే వీటిని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్లో సెక్రటేరియెట్ దగ్గర, మాసాబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్తో పాటు మరికొన్ని ప్రభుత్వ ఆఫీసుల దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేసి వీటిని విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. డీ మార్ట్, మోర్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ ఔట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్లలో దొరికేలా ఆయా యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించారు. ఆయా మాల్స్కు పర్మిషన్లు ఇచ్చే మున్సిపల్ కార్పొరేషన్లు, అధికారుల సహాయం తీసుకోవాలని జీసీసీ అధికారులు డిసైడ్ అయ్యారు. వారితో చర్చలు పూర్తవగానే.. ఉత్పత్తులు ప్రజలకు చేరవ కానున్నాయి.