byసూర్య | Thu, Apr 18, 2024, 07:55 PM
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు గులాబీ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. వీరిలో సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఇన్నారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు కూడా కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదురుగాలి వీస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో షాక్ తగిలింది.
హైదరాబాద్ నగరంలో కీలక నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో సముచిత స్థానం దక్కకపోవటంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.
'నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్దికి కోసం పాటుపడ్డాను. నాపై ఎటువంటి మచ్చలేకున్నా.. గత ఎన్నికల్లో నన్ను కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయినా మీ మీద విశ్వాసంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఎంపీ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని ఆశించాను. మాటమాత్రం చెప్పకుండా, ఎటువంటి చర్చ లేకుండానే రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ మాత్రం నా తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్కు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అవకాశవాద ఎంపీలను గెలిపించటం కంటే.. ఉద్యమ సహచరుడు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. కావునా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునా.' అని సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
2018లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు ప్రయత్నించినా.. ఆయనకు నిరాశే దక్కింది. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వటంతో అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు.