byసూర్య | Thu, Apr 18, 2024, 12:33 PM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. సెలవు రోజు ఆదివారం మినహా ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో నామినేషన్లను స్వీకరిస్తామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.26న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 29వ తేదీ చివరి గడువు అని, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 6న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చని తెలిపారు. వంద మీటర్ల లోపే వాహనాలను నిలుపాలని, లోక్సభ అభ్యర్థికి సెక్యూరిటీ డిపాజిట్ రూ.25వేలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థికి రూ. 12,500 అని పేర్కొన్నారు.చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజిగిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించగా.. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి గురువారం తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ-ఫామ్ను అందజేయనున్నారు.