byసూర్య | Tue, Apr 09, 2024, 06:20 PM
రెండ్రోజుల క్రితం హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో బ్రిడ్జిపై వాహనాలు నిలిపి.. సరదాగా ఫోటోలు తీసుకుంటుండగా ఓ గుర్తు తెలియని కారు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇప్పటి వరకు యాక్సిడెంట్కు కారణమైన వాహనం జాడ తెలియరాలేదు. యువకులు నిర్లక్ష్యంగా ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించటం వల్లే యాక్సిడెంట్ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలు ఆపితే ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు ఆపితే రూ. 1000 ఫైన్ విధిస్తామన్నారు. దుర్గం చెరువు ఫోటోలు, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్లో మాత్రమే దిగాలని, రోడ్ మీద పార్క్ చేసి ఫోటోలు దిగితే రూ. 1000 ఫైన్ విధిస్తామని మాదాపూర్ సీఐ మల్లేష్ హెచ్చరించారు. వాహనాలు ఐటీసీ కోహినూర్ దగ్గరలో పార్క్ చేసి కేబుల్ బ్రిడ్జిలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్లో మాత్రమే ఫోటోలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇక నుంచి ఎట్టిపరిస్థితిల్లోనూ దుర్గం చెరువు రోడ్డుపై ఫొటోలకు అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని సీఐ కోరారు.