byసూర్య | Fri, Mar 29, 2024, 08:10 PM
తెలంగాణలో రైతులకు శుభవార్త. జిల్లాల వారీగా యాసంగి (రబీ) ధాన్యం కొనుగోళ్ల టార్గెట్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. అలాగే జగిత్యాల, నల్గొండ, కామారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 7,149 కొనుగోలు కేంద్రాల ద్వారా 75.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది పౌరసరఫరాల సంస్థ. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉంది.. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో మార్చి మొదటివారంలోనే వరి కోతలు మొదలయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఈ రెండు జిల్లాల్లో ముందే ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం అనుమతించింది. ఈ జిల్లాల్లో మొత్తం 836 కొనుగోలు కేంద్రాలకు గాను అవసరమైన ప్రాంతాల్ని గుర్తించి 19 కేంద్రాలను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కొనుగోలు కేంద్రాలను ఎన్నికల నియమావళికి అనుగుణంగానే ప్రారంభించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మేడ్చల్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంది. మొత్తం కలిపి ఈ సంఖ్య 257.. ఈ జిల్లాల్లో ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉండటం ఒక కారణంగా ఉంది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు ధాన్యం రవాణా వాహనాల టెండర్లను, గన్నీ టెండర్లను ఖరారు చేసేందుకు అనుమతి కోసం ఎన్నికల కమిషన్కు పౌరసరఫరాల సంస్థ లేఖ రాసింది. ఎండల తీవ్రత నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి సరఫరా, టెంట్లు, చలువ పందిళ్లు వంటి ఏర్పాట్లు చేయాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
సూర్యాపేట, కరీంనగర్,సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, నాగర్కర్నూల్, జనగామ, వనపర్తి, నిర్మల్, సంగారెడ్డి, మంచిర్యాల, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, నారాయణపేట, మహబూబ్నగర్, భూపాలపల్లి, ఖమ్మం, వికారాబాద్, గద్వాల, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, ఆసిఫాబాద్, మేడ్చల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారు. ఆయా జిల్లాల్లో లక్ష్యాలను బట్టి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు.