byసూర్య | Fri, Feb 23, 2024, 09:21 PM
తన తండ్రి అడుగుజాడల్లో నడిచి అతి చిన్న వయసులో ప్రజల మనసులు గెలుచుకుని మొదటిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించి.. అందరి చేత శెభాష్ అనిపించుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత.. ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోయిన విషయం తెలిసిందే. అయితే.. తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన లాస్య నందిత మరణం.. ఎంతో మందిని కన్నీళ్లు పెట్టేలా చేసింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో తన తండ్రి హఠాన్మరణం.. మళ్లీ ఇప్పుడు తానూ తనువు చాలించటం.. యాదృశ్చితకమే అయిన ఎంతో బాధాకరం. అయితే.. ఆమె మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటనపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇదే విషయంపై పోలీస్ అధికారులు స్పందించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది.. అందుకు కారణాలేంటీ అన్నది వివరించారు.
పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు కీలక విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె పీఏ ఆకాశ్(24) ఉన్నట్టుగా తెలిపారు. అయితే.. గురువారం రోజున రాత్రి సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత.. తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో సదాశివపేటలోని దర్గాకు వెళ్లారు.
అక్కడి నుంచి వెకువజామున బయలుదేరిన లాస్య నందిత.. ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన పీఏతో కలిసి టిఫిన్ కోసమని.. సుమారు 4:58 గంటల సమయంలో శామీర్పేట టోల్ ప్లాజా వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి ఎంటరయ్యారు. సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో ఉదయం 5:30 గంటల సమయంలో.. ముందు వెళ్తున్న టిప్పర్ను ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది. అతివేగంతో వస్తున్న కారు ముందున్న టిప్పర్ను ఢీకొట్టటంతో.. అదుపుతప్పి అదే స్పీడ్లో వెళ్లి రెయిలింగ్ను ఢీకొట్టింది. దీంతో.. కారు ముందు భాగం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నది. కాగా.. లాస్య నందిత.. సీటు బెల్ట్ పెట్టుకున్నా అది ఊడిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. స్పీడ్గా ఢీకొట్టటంతో.. బలంగా ముందు సీటుకు తగలటంతో.. తలభాగానికి తీవ్రగాయమైంది. దవడ భాగం విరిగిపోయి. పళ్లు కూడా చాలా వరకు విరిగాయని, పక్కటెముకలు కూడా దెబ్బతిన్నాయి. తొడభాగంలో ఎముక విరిగిపోయిందని పోలీసులు వివరించారు.
అయితే.. ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పొద్దున నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత బతికే ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న లాస్య నందితను.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయినట్టు ఏఎస్పీ వివరించారు. పీఏ ఆకాశ్ ఎడమకాలు విరిగిపోగా... శ్రీకర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏఎస్పీ సంజీవ రావు తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంపై చాలా మంది ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. ఇది రోడ్డు ప్రమాదమే అని పోలీసులు తేల్చారు. దీని వెనుక ఎలాంటి కుట్ర కోణాలు లేవని నిర్ధారించారు.
ఇదిలా ఉంటే.. ప్రమాద సమయంలో లాస్య నందిత కారు నడిపించిన ఆకాశ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ ఆకాశ్పై 304 ఏ సెక్షన్ కింద పటాన్చెరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైందన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.