byసూర్య | Tue, Feb 20, 2024, 07:55 PM
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. పేదల ప్రాణాలు లెక్క చేయకుండా డబ్బులే లక్ష్యంగా మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. ట్రీట్మెంట్ పేరుతో లక్షలకు లక్షలు లాగేస్తున్నారు. తాజాగా.. రక్తంతోనూ వ్యాపారాలు చేస్తున్నారు. దాతల నుంచి సేకరించిన బ్లడ్, ప్లాస్మాను అమ్ముకుంటున్నారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడుల్లో ఆ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్లను రద్దు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అథారిటీ (DCA) డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మూసాపేట్లోని ఓ అపార్ట్మెంట్లో హీమో సర్వీస్ పేరిట నడుస్తున్న ఓ ల్యాబ్లో డీసీఏ అధికారులు ఈనెల ప్రారంభంలో దాడులు నిర్వహించారు. డీసీఏ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న ఈ ల్యాబ్ నుంచి రక్తం, ప్లాస్మాను వేరు చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మియాపూర్ మదీనగూడలోని శ్రీకర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్షిఫాలోని అబిద్ అలీ ఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ సెంటర్ వాళ్లు డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించి, ప్లాస్మాఫెరేసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తున్నారు.
ఆ తర్వాత హీమో సర్వీసెస్కు ప్లాస్మాను అమ్ముతుండగా.. వారు హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, పూణేలోని పరిశోధన మరియు బయోసైన్స్ సంస్థలకు భారీ లాభానికి విక్రయిస్తున్నారు. దీంతో ఆ రెండు బ్లడ్ బ్యాంకుల్లో సోదాలు చేసి ప్లాస్మా అమ్మకాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకొని నిర్వాహకులకు నోటీసులిచ్చారు. విచారణలో వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్లను తాజాగా రద్దు చేశారు.
2016 నుంచి ఈ దందా జరుగుతోందని.. ఇప్పటివరకు 6 వేల యూనిట్లకు పైగా ప్లాస్మాను హీమో సర్వీస్ సేకరించిందని డీసీఏ విచారణలో వెల్లడైంది. ఒక్కో యూనిట్ ప్లాస్మాను రూ.700కు కొని, రూ.3,800కు అమ్ముతున్నట్టు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్.రాఘవేంద్ర నాయక్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ముఠాతో క్రయ విక్రయాలు జరిపిన ల్యాబ్లు, రీసెర్చ్ సంస్థల యాజమాన్యాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.