byసూర్య | Sun, Dec 03, 2023, 11:22 AM
తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం పేరు మారుమోగుతోంది. ఇక్కడ నుంచి మారింది శిరీష అలియాస్ బర్రెలక్క పోటీకి దిగింది. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసింది.అయితే గతంలో ఇక్కడ నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో నర్సింహారెడ్డి, 1972లో రంగదాసు, 2004లో జూపల్లి కృష్ణారావు స్వతంత్రులుగా గెలిచారు. ఈ సారి బర్రెలక్క ఈ నియోజకవర్గంలో గెలిస్తే చరిత్ర సృష్టించినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో బర్రెలక్క విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
అసలు శిరీష (బర్రెలక్క) విజయం సాధిస్తుందా.. ఈమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయని అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. ఓ సర్వే ప్రకారం శిరీషకు దాదాపు 15వేలకు పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తోంది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందనున్నారని విశ్లేషించింది.నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అలియాస్ బర్రెలక్క నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి మద్యానికి బానిసయ్యాడు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లితో కలిసి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుంది. ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ చేసి.. గ్రూప్-1, గ్రూప్-2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. ఎన్నోసార్లు ప్రయత్నించినా ఆమెకు ఉద్యోగం రాలేదు.
అందుకే నాలుగు బర్రెలు కొన్నుక్కుని కాస్తున్నాంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల గురించి చెబుతూ ఓ రీల్ చేసింది. 30 సెకన్లు ఉన్న ఆ రీల్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ కావడంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఆ ఫేంతోనే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్లారు. సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అన్ని వర్గాల మద్దతు ఆమెకు లభించింది. దీంతో బర్రెలక్క భవితవ్యంపై చర్చ జరుగుతోంది.