పకడ్బందీగా కౌంటింగ్,,,,తొలి రౌండ్ ఫలితం ఎన్ని గంటలకు,,,?

byసూర్య | Sat, Dec 02, 2023, 08:13 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు పర్వానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం (డిసెంబర్ 3) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో 13 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి రౌండ్ ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి అధికారం దక్కనుందనే అంశంపై అంచనా ఏ సమయానికి వస్తుంది? పూర్తి ఫలితాలు వెల్లడి అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? కీలక వివరాలు..


సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియతో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అర గంట నుంచి గంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతారు. ఈ లెక్కన ఉదయం 9 - 9.30 మధ్యలో తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈసారి ప్రతి ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుందని.. అందువల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు.


ఆయా నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయం ఉంటుంది. అంటే.. భద్రాచలం లాంటి చిన్న నియోజకవర్గం (ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నది) ఓట్ల లెక్కింపు తుది ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. శేరిలింగంపల్లి లాంటి పెద్ద నియోజకవర్గం తుది ఫలితాలు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సరాసరి ఒక రౌండ్‌కు అర గంట పడుతుంది. అన్ని టేబుళ్ల లెక్కింపు పూర్తైన తర్వాత ఆ రౌండ్‌ ఫలితంపై స్పష్టత వస్తుంది. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకొని, ఆ రౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నింటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్‌ కౌంటింగ్ మొదలవుతుంది.


ఈ లెక్కన మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఫలితాల సరళిపై ఒక అంచనా వస్తుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్న ఆయా పార్టీల అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారనే అంశంపై కాస్త క్లారిటీ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటే.. ఈ విషయాన్ని అంచనా వేసేందుకు మరింత సమయం పడుతుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల ముందు కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. లోపలా, బయటా సీసీ కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘా పెట్టారు. ఒకే ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.


భద్రాచలం నియోజకవర్గం ఫలితం 12 రౌండ్లలో వెలువడనుంది. కౌంటింగ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అశ్వరావుపేట ఫలితం 13 రౌండ్లలో వెలువడనుంది. పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలకు ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేశారు. 500లకు పైగా కేంద్రాల్లో పోలింగ్ జరిగిన శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, మేడ్చల్ లాంటి పెద్ద నియోజకవర్గాల్లో 28కి పైగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, పటాన్‌చెరు నియోజకవర్గాలకు 20కి పైగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఆరుగురు అధికారులు ఉంటారు. మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. బరిలో నిలిచిన అభ్యర్థుల తరఫున ఒక్కో కౌంటింగ్‌ ఏజెంట్‌కు ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అవకాశం ఇస్తారు. పోటీ చేసే అభ్యర్థి దరఖాస్తు మేరకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్‌ అధికారి అనుమతి ఇస్తారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవరికీ కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించిందుకు వీల్లేదు. టేబుళ్ల వెనుక వైపు ఇనుప కంచె బిగిస్తారు. టేబుల్ ఎదురుగా కంచె అవతల అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తుంటారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM