byసూర్య | Sat, Dec 02, 2023, 08:04 PM
ప్రస్తుతం వాతావరణంలో మార్పుల కారణంగా చాలామంది అనారోగ్యం బారినపడుతున్నారు. దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే చాలామంది డాక్టర్ వద్దకు వెళ్లకుండా.. సొంతంగా మెడిసిన్ తెచ్చుకొని వాడుతుంటారు. గూగుల్లో వెతికి మెడికల్ షాపుకు వెళ్లి మెడిసిన్ కొనితెచ్చి వేసుకుంటారు. అది చాలా ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాగే ఓ వ్యక్తి కుమార్తె అనారోగ్యం గురించి ఆన్లైన్లో వెతికి.. అందులో సూచించిన మందులు తరచూ కొనిచ్చేవాడు. ఆమె మందులు వాడిన ఆమె చివరికి ఆరోగ్యం విషమించి.. హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు అత్యవసర చికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు.
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ని కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర కులకర్ణి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతి పదేపదే జ్వరం, మూత్రంలో మంట రావడంతో ఇటీవల ఏఐఎన్యూలో చేర్చారు. సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు ఆమె మూత్రపిండాల్లో 10-13 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న కొన్ని రాళ్లను గుర్తించారు. యువతిని, ఆమె తండ్రిని ప్రశ్నించినగా.. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు తండ్రి గూగుల్లో వెతికి యాంటీ బయాటిక్స్ తెచ్చి ఇచ్చేవారని తెలిపారు. అవి కూడా సగం కోర్సు వాడేసి వదిలేసేవారని డాక్టర్ రాఘవేంద్ర వెల్లడించారు.
అనారోగ్యం వచ్చినప్పుడల్లా.. ఇలా చేయడం వల్ల శరీరంలో యాంటీ బయాటిక్స్ నిరోధకత పెరిగి మందులకు లొంగని బ్యాక్టీరియా తయారందైందన్నారు. అతిగా యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల ప్రొటీన్లు గట్టిపడి అవి మూత్రపిండాల్లో రాళ్లుగా మారాయని చెప్పారు. ఆమెకు సర్జరీ చేసి రాళ్లను తొలగించామని ప్రస్తుతం ఆమె కోలుకొని ఆరోగ్యం ఉందన్నారు. డాక్టర్ల సూచనలు లేకుండా ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ మెడిసిన్ వినియోగించటం ప్రమాదకరమని తెలిపారు. అవి కూడా సగం వాడేసి వదిలేస్తే మరింత ముప్పు అని.. మందులకు లొంగని బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని తెలిపారు. డాక్టర్ల సూచనలతోనే మెడిసిన్ వాడాలని అంటున్నారు.