శ్వాసకోశ సంబంధిత పరిశోధనల ఫలితాలు ప్రజలందరికీ చేరాలి: శ్రీశ్రీ రవిశంకర్

byసూర్య | Sat, Dec 02, 2023, 07:06 PM

ప్రతిష్ఠాత్మక నాప్ కాన్- 2023 25వ జాతీయ సదస్సు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవోటెల్ హోటల్‌లో నవంబరు 30 ప్రారంభమైంది. ఇండియన్ ఛెస్ట్ సొసైటీ, నేషనల్ కాలేజీ ఆఫ్ ఛెస్ట్ ఫిజీషియన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల సదస్సును ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్వాసకు, ఆరోగ్యానికి సంబంధించిన సుదర్శన క్రియా యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రారంభించారు. ‘ఊపిరితిత్తుల పునరుజ్జీవం ద్వారా కొత్త జీవితం’ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈ సదస్సులో సదస్సు కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ఆర్. విజయకుమార్, పద్మశ్రీ డాక్టర్ ఫారుఖీ, పద్మశ్రీ డాక్టర్ కిషన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా, డాక్టర్ దీపక్ తల్వారా, డాక్టర్ గౌతమ్ భగత్, డాక్టర్ ఎస్. ఎన్ రావు మొదలైన ప్రముఖ జాతీయ శ్వాసకోశ వైద్య నిపుణులు పాల్గొంటున్నారు.


ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. శ్వాసకోశ వైద్యులు మానవాళికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. సాధారణంగా మనం అంతగా పట్టించుకోని శ్వాస, అనేక లయలలో మన భావావేశాలతో సంబంధం కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్వాసకు గల ప్రాధాన్యత శ్వాసకోశ వైద్యులకు తెలుసని, కేవలం వ్యాధులను నయం చేయడం మాత్రమే కాకుండా, వ్యాధులు రాకుండా నివారించే విషయంలో వారు కీలకపాత్ర పోషించాల్సి ఉందని గురుదేవ్ అభిప్రాయపడ్డారు. మన ఆలోచనలు, భావాలను మనం శ్వాసించే విధానం ఎలా ప్రభావితం చేయగలదో వివరిస్తూ... భారతీయ యోగ సాధకులు పాటించి, వివరించిన శ్వాస ప్రక్రియలపై అధ్యయనాలు చేయాలని, సామాన్య ప్రజలు మరింత బాగా శ్వాస తీసుకునేందుకు సహాయపడాలని కోరారు.


ఈ సందర్భంగా నిపుణులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. మనం ధ్యానం చేసేటప్పుడు మన శ్వాస ఏవిధంగా మెత్తనై, దీర్ఘంగా మారుతుందో వివరించారు. ‘మన రెండు నాసికా రంధ్రాల ద్వారా పీల్చుకునే గాలి ఒకే విధంగా ఉండదు’ అని సూచిస్తూ ఆయన, కుడి నాసిక మన జీవక్రియకు, ఎడమ నాసిక ధ్యానానికి సంబంధించి ఉంటుందని అన్నారు. శరీరంలోని వివిధ భాగాలలో వివిధ అనుభూతులు స్థిరపడతాయని, వాటిని నియంత్రించి, చెడు భావావేశాలను తొలగించి, మంచి అనుభూతులను పెంపొందించేందుకు శ్వాస మనకు సహాయపడుతుందని శ్రీశ్రీ రవిశంకర్ వివరించారు.


ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలంగాణ నృత్యరూపకం పేరిణి నాట్యం, పేరిణి లాస్యం ఆహుతులను అలరించాయి. కార్యక్రమానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కామినేని ఆసుపత్రి శ్వాసకోశ విభాగాధిపతి డాక్టర్ శుభకర్ కంది మాట్లాడుతూ.. శ్వాసకోశ వైద్య నిపుణులను, అధ్యయనకర్తలను ఒకదగ్గరకు చేర్చేందుకు ఈ నాప్ కాన్ 2023 వేదిక ఉపయోగపడిందని తెలిపారు. ‘శ్వాసకోశ విజ్ఞానంలోని సరికొత్త విషయాలను పంచుకుని, పరస్పర సహకారం, సమన్వయం ద్వారా ప్రగతి సాధించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సుకు 65 దేశాల నుంచి 3000కుపైగా వైద్యులు, పరిశోధకులు హాజరయ్యారు. వచ్చే మూడు రోజులలో 108 శాస్త్ర విజ్ఞాన చర్చలు ఇక్కడ జరగనున్నాయి’ అని ఆయన తెలిపారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM