byసూర్య | Fri, Dec 01, 2023, 07:10 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టుగా రాష్ట్రమంతా తిరుగుతూ.. జోరు ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు.. మూకుమ్మడిగా కాంగ్రెస్కే మొగ్గు చూపిన ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో నమ్మశక్యంగా లేవని అభిప్రాయపడ్డారు. అసలైన ఫలితాలు మాత్రం తమకు శుభవార్త వినిపించనున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను గెలిపించి.. హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. కేటీఆర్ గట్టిగానే కృషి చేశారు. 60 రోజుల్లో 30 బహిరంగ సభలు, 70 రోడ్ షోలు, 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు కేటీఆర్. ఈ క్రమంలో.. ఏ రోజు కూడా కంటి నిండా నిద్రపోడానికి సమయం దొరకకపోవటం సాధారణమే. అయితే.. చాలా రోజుల తర్వాత.. పోలింగి ముగియగా ప్రశాంతంగా.. కంటి నిండా నిద్రపోయినట్టు కేటీఆర్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. పోలింగ్ ముగియగానే.. ప్రముఖ సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఒకటీ రెండు మినహా.. అన్ని సంస్థలు కాంగ్రెస్కే మొగ్గు చూపటం గమనార్హం. ఆ ఫలితాలు చూసిన అనంతరం.. మీడియా సమావేశం పెట్టిన కేటీఆర్.. బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ ఆందోళన చెందకూడదని.. సూచించారు. మొదట.. 88 సీట్లు వస్తాయని భావించామని.. పలు కారణాల వల్ల ఆ సంఖ్య 70కి చేరిందని తెలిపారు. మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుందని.. సంబురాలకు సిద్ధం కావాలని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కేటీఆర్.