byసూర్య | Fri, Dec 01, 2023, 07:02 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. ఎలాంటి ఫలితాలు ఏర్పడనున్నాయన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే.. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ .. చాలా వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. దీంతో.. కాంగ్రెస్ శ్రేణులు నిన్నటి నుంచే సంబురాలు షురూ చేశాయి. ఈ నేపథ్యంలోనే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు రేవంత్ రెడ్డి.
"గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది. ప్రతి ఒక్కరికి అభినందనలు." అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అయితే.. నిన్న ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే.. మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో గులాబీ బాస్ కేసీఆర్ను ఓడగొట్టినందుకు కృతజ్ఞతలు అంటూ సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని.. అందుకు ఎగ్జిట్ పోల్సే నిదర్శనమని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో.. కాంగ్రెస్ శ్రేణులు మంచి ఉత్సాహంలో ఉన్నారు.