byసూర్య | Wed, Nov 22, 2023, 09:55 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఖర్గేకు రేవంత్ రెడ్డి, రాక్రే స్వాగతం పలికారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి అలంపూర్ పయనం కానున్నారు. అలంపూర్ బహిరంగ సభలో ఖర్గే పాల్గొని ప్రసంగించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వారం రోజులే గడువు ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్యాంపెయిన్ను ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నేడు 5 నియోజకవర్గాల్లో పర్యటించున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్లలో బహిరంగసభలుండగా.. కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండనున్నాయి.
గడీల పాలన పోవాలి.. ప్రజాపాలన రావాలని ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘‘అచ్చంపేటలో చీమలదండుగా కదలివచ్చిన మిమ్మల్ని చూస్తోంటే.. 50వేల మెజారిటీతో వంశీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో గువ్వల బాలరాజు రౌడీమూక ప్రజలపై దాడి చేస్తున్నా ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఇక నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది. ప్రజలు తలుచుకుంటే కేసీఆర్ గడీ నేలమట్టమవుతుంది’’ అని ట్వీట్ చేశారు.