byసూర్య | Mon, Sep 25, 2023, 06:49 PM
హైదరాబాద్లోని ప్రసిద్ధ కరాచీ బేకరీ.. ఇటీవలే అంతర్జాతీయ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధ టేస్ట్ అట్లాస్ జాబితాలో చోటు దక్కించుకుని వాహ్వా అనిపించుకున్న కరాచీ బేకరీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే.. ఈసారి మాత్రం వినియోగదారుల కంప్లైంట్తో చర్చనీయాంశంగామారింది. హైదరాబాద్కు చెందిన ఓ వినియోగదారుడు కరాచీ బేకరీపై కంప్లైంట్ చేయగా.. జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1 లో ఉన్న కరాచీ బేకరీపై వచ్చి కంప్లైంట్ ఆధారంగా.. ఖైరతాబాద్ సర్కిల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీవెనక.. కరాచీ బేకరిలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలు నిర్వహించిన అధికారులు.. అనుమానమున్న పలు నమూనాలు సేకరించి పరీశీలనకు పంపించారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా 150 అత్యంత ప్రసిద్ధ డెజర్ట్ ప్రదేశాలలో టేస్ట్ అట్లాస్ జాబితాలో చోటు దక్కించుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ తనిఖీలు జరగటం.. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కరాచీ బేకరీ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కరాచీ బేకరీ స్పెషల్ అయిన ప్రత్యేక ఫ్రూట్ బిస్కెట్లను ప్రపంచవ్యాప్తంగా 29వ అత్యుత్తమ డెజర్ట్గా టేస్ట్ అట్లాస్ ర్యాంక్ చేసింది. సిగ్నేచర్ ప్రొడక్ట్గా బిస్కెట్లకు ప్రత్యేక స్థానం ఉందని టేస్ట్ అట్లాస్ పేర్కొంది.
అయితే.. కరాచీ బేకరీని హైదరాబాద్లో 1953లో స్థాపించారు. ఈ బేకరీని మొదట్లో మోజమ్ జాహీ మార్కెట్లో మొదటి శాఖను ప్రారంభించగా.. తర్వాత బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో సహా చాలా నగరాలకు విస్తరించింది. ఇక హైదరాబాద్ నగరంలో.. మోజమ్జాహి మార్కెట్, బంజారాహిల్స్, శంషాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, షేక్పేట్తో సహా వివిధ ప్రాంతాలలో ఈ బేకరీకి శాఖలున్నాయి. అంతేకాదు.. కరాచీ బేకరీ ప్రస్తుతం.. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్తో పాటు చాలా దేశాలకు దాని ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది.