byసూర్య | Mon, Sep 25, 2023, 06:43 PM
కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. నోటరీ స్థలాల క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ.. ఈ ఏడాది జులై 26న కేసీఆర్ సర్కారు జీవో నెంబర్ 84 విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జీవోపై హైకోర్టు స్టే విధిస్తూ.. సోమవారం రోజున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పట్టణ ప్రాంతాల్లో కొన్ని భూములు నోటరీ ద్వారా కొనుగోళ్లు జరగగా.. అలాంటి స్థలాలను తగిన స్టాంప్ డ్యూటీ చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం.. జీవో నెంబర్.84 ద్వారా ఛాన్స్ ఇచ్చింది. కాగా.. ఈ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది.
కాగా.. భాగ్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే జీవో నెం.84ను పూర్తిగా పరిశీలించిన ధర్మాసనం.. ఈ అంశంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ఇప్పుడు నోటరీ స్థలాల క్రమబద్ధీకరణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని నోటరీ స్థలాల రిజిస్ట్రేషన్లకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది.