byసూర్య | Wed, Mar 22, 2023, 11:17 AM
కొత్త సంవత్సరం శుభాలు కలగాలి అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ 'శోభకృత్' నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ ఉగాది ప్రజలందరి జీవితాలలో ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, ఆనందాన్ని నింపాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఉగాది ఆనందం , ఆశల పండుగ అని, కొత్త సంవత్సరం కొత్త ఉల్లాసాన్ని , ఉజ్వల భవిష్యత్తును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గవర్నర్. తెలంగాణ ప్రజలకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు.