![]() |
![]() |
byసూర్య | Fri, May 17, 2024, 09:04 PM
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై తెలంగాణలో చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్ జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (డిసెంబర్ 2023) జరగ్గా.. ఆ సమయంలో ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేందుకు కిరణ్ కుమార్ ఆసక్తి చూపించాడు. కాగా.. కిరణ్ కుమార్కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మాట ఇచ్చిన కేఏ పాల్.. 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని తెలిపాడు. ఈ మేరకు డబ్బులు తీసుకుని.. టికెట్ ఇవ్వకుండా తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదు చేశారు.
అయితే.. కేఏ పాల్కు ఇచ్చిన 50 లక్షల్లో.. 30 లక్షలు ఆన్లైన్లో చెల్లించానని, మిగిలిన 20 లక్షలను పలు దఫాల్లో ఆయనకే ఇచ్చానని కిరణ్ కుమార్ తెలిపాడు. డబ్బులైతే తీసుకున్నాడు కానీ.. తనకు ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వలేదని కిరణ్ కుమార్ తెలిపాడు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు.
అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి తరుపున ఆయనతో పాటు పలువురు అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు.. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం కేఏ పాల్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అప్పుడు భీమవరం నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సైతం కేఏ పాల్ పోటీ చేశారు. నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఏ పాల్ కు3,037 ఓట్లు వచ్చాయి. ఇక.. తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ విశాఖ ఎంపీగా కేఏ పాల్ పోటీ చేశారు.