![]() |
![]() |
byసూర్య | Fri, May 17, 2024, 09:00 PM
అమెరికాలో విషాద ఘటన జరిగింది.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన విద్యుత్శాఖ రిటైర్డ్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం.. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో ఉన్న అలకాపురిలో స్థిరపడింది. వెంకటరమణ రెండేళ్ల క్రితం చనిపోగా.. వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ యూఎస్లోని నార్త్ కరోలినాలో ఎనిమిదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నారు. పృథ్వీరాజ్కు గతేడాది శ్రీప్రియతో వివాహమైంది.
బుధవారం రోజు పృథ్వీరాజ్ భార్య శ్రీప్రియతో కలిసి కారులో వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును పృథ్వీ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అది పల్టీలు కొట్టింది.. తమ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో పృథ్వీ, శ్రీప్రియలు సురక్షితంగా బయటపడ్డారు. పృథ్వీ భార్యను కారులోనే కూర్చోబెట్టి.. బయటికి వచ్చి ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ చేస్తున్నారు.
పృథ్వీ ఫోన్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన మరో కారు అతడ్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్మార్ట్ అనంతరం పృథ్వీ మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పృథ్వీ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.