byసూర్య | Tue, Jan 24, 2023, 05:01 PM
హైదరాబాద్ నగరంలో ఫ్రీగా టిఫిన్ అందించేందుకు కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చారు. అయితే ఇది అందరికీ కాదు. కేవలం కొంతమందికి మాత్రమే ఉదయం వేళల్లో ఉచితంగా టిఫిన్ అందించనున్నారు. చిరుధాన్యాల ప్రాధాన్యతపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన కొంతమంది వాసులు ఒక టీమ్గా ఏర్పాడ్డారు. ఇంటర్నేషనల్ ఇయర్స్ ఆఫ్ మిల్లెట్స్ 2023 అనే కార్యక్రమం పేరుతో ఏడాది పాటు ఉచితంగా టిఫిన్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ అందరికీ టిఫిన్ సదుపాయం ఉండదు.
రోజుకు 365 మందికి మాత్రమే ఫ్రీ టిఫిన్ అందించనున్నారు. 365 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలో రోజుకో ప్రాంతంలో మొబైల్ క్యాంటీన్ ద్వారా 365 మందికి ఉచిత టిఫిన్ వడ్డించనున్నారు. చిరుధాన్యాలతో వండిన స్వచ్చమైన టిఫిన్ పెట్టనున్నారు. పొంగల్, ఇడ్లీ, దోసతో పాటు వివిధ రకాల టిఫిన్లు వడ్డించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రసాయనాలు లేకుండా పండించిన స్వచ్చమైన చిరుధాన్యాలతో తయారుచేసిన టిఫిన్లను పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. దీని ద్వారా చిరుధాన్యాల ప్రాధాన్యతను అందరికీ తెలియజేస్తామని చెబుతున్నారు. ఈ కార్యక్రమం కోసం పలు సంస్థల సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కల్తీ ఆహారం ద్వారా చాలామంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, స్వచ్చమైన చిరు ధాన్యాలు తినడం ద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసేందుకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు.