byసూర్య | Tue, Jan 24, 2023, 05:00 PM
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా చలి విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు పడిపోతున్నాయి. రోజు రోజుకూ రాత్రి , పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొండ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తుంది. పర్యాటకులు అక్కడకు చేరుకుని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ చలి ప్రభావం పెరిగింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 26 నుంచి నగరంలో ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈనెల 26 నుంచి నగరంలోని 11 డిగ్రీ సెంటిగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
హైదారాబాద్లో ఐదు జోన్లు, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, ఛార్మినార్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఉదయం విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహన రాకపోకలు స్పష్టంగా కనిపించవని., అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. అత్యవసరమైతేనే ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలని, వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని అధికారులు చెప్పారు.