byసూర్య | Thu, Sep 22, 2022, 12:32 PM
శాయంపేట మండల కేంద్రం నుండి మైలారం గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో నిర్మించిన లో లెవెల్ వంతెన గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పెద్ద గొయ్యి ఏర్పడింది. వాహనదారులు ఇది గమనించక అటువైపుగా వెళ్లి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయి. శాయంపేట మైలారం గ్రామాల మధ్య వారధిగా ఉండాల్సిన లో లెవెల్ వంతెన నిర్మాణానికి ఆర్అండ్బి ద్వారా 11 లక్షల రూపాయలకు టెండర్ ఖరారు కాగా కాంట్రాక్టర్ ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించక నిర్మించడంతో వంతెన చిద్రమై పోయింది. మీద మీద పనులు చేసి మమ అనిపించి కాంట్రాక్టర్ బిల్లులు తీసుకున్నాడు. ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మించిన కాంట్రాక్టర్ పట్ల ప్రజల సొమ్ము పాపాత్ముల పాలు అన్నట్టుగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వెంటనే అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.