byసూర్య | Fri, Aug 19, 2022, 09:11 PM
మునావర్ కామెడి షో నేపథయంలో ముందస్తుగా బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన కామెడీ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించడం.. నగరంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆయణ్ని అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు సందర్భంగా పోలీసులకు, రాజాసింగ్, ఆయన అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. రాజాసింగ్ను నివాసం నుంచి బయటకు రావొద్దని చెప్పినా వినలేదని.. అందువల్ల ఆయన్ని ఆరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో శనివారం మునావర్ షోకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయితే, దీనికి పోలీసులు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజు సాయంత్రం వరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఆయన షోను జరగనివ్వబోమని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు.
‘మునావర్ ఫారుఖీ షోను కచ్చితంగా అడ్డుకుంటాం. మా కార్యకర్తలు ఇప్పటికే ఆన్లైన్లో ఆ షో టికెట్లు తీసుకున్నారు. షో లోపలే మునావర్పై దాడి చేస్తాం. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని రాజాసింగ్ హెచ్చరించారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా తాను తగ్గేది లేదని, షోను అడ్డుకొని తీరుతామని రాజాసింగ్ హెచ్చరించారు. ‘ధర్మం కంటే నాకు పార్టీ ముఖ్యం కాదు’ అని ప్రకటించారు. హిందూ దేవుళ్లను కించపరిచే వారి కామెడీ షోలకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని రాజాసింగ్ ప్రశ్నించారు.
‘నగరంలో మునావర్ ఫారూకీ షో జరిగితే.. మరుసటి రోజు నా సమాధానం కూడా గట్టిగానే ఉంటుంది. నా వల్ల ఇప్పటివరకు ఎక్కడా శాంతి భద్రతల సమస్య రాలేదు. కానీ, రేపు జరగబోయే కామెడీ షోను తప్పనిసరిగా అడ్డుకుంటాం’ అని రాజాసింగ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు తొలుత హౌస్ అరెస్టు చేయాలని భావించారు. అయితే, ఆయన నివాసం వద్దకు అనుచరులు, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడం.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఆయణ్ని అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.