byసూర్య | Tue, Aug 16, 2022, 03:34 PM
వజ్రోత్సవ వేడుకలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ ముఖ్య కూడలిలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమాలకు షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపనను ప్రారంభించారు. వేలాదిమంది ఎక్కడికక్కడే నిలిచిపోయి ఎంతో భక్తిగా గీతాన్ని ఆలపించడం విశేషం. అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రసంగించారు.
ఏ స్వార్థం లేకుండా దేశమాత స్వేచ్ఛ కోసం తిరుగుబాటు చేసి 75 ఏళ్ల క్రితం మనకు స్వరాజ్యాన్ని సాధించిన మహనీయులను స్మరించుకోవడంతో జన్మ సార్ధకమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వజ్రోత్సవాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విశిష్టాత్మకంగా చేపడుతుందని వివరించారు. ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితమే ఈ స్వాతంత్రం అని ఈ ఫలాలను అనుభవిస్తున్న ప్రతి పౌరుడు మహావీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 75వ వజ్రోత్సవాలకు ప్రతి పౌరుడు ఎంతో నిబద్ధతతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని దీనివల్ల అమరవీరుల ఆత్మ శాంతిస్తుందని అన్నారు. కులమతాలకు అతీతంగా సాగుతున్న ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శప్రాయమైందని అన్నారు.