byసూర్య | Sat, Aug 06, 2022, 04:14 AM
అవకాశవాదులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ శ్రేణులు దిగులు పడాల్సిన అవసరం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చామని చెప్పిన రేవంత్ రెడ్డి... నాడు పాల్వాయి కుటుంబానికి అన్యాయం జరిగినా.. వారు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు. నేడు తమకు అవకాశం దక్కలేదని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి పాల్వాయి కుటుంబాన్ని చూసి అయినా బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. మునుగోడు పార్టీ శ్రేణులకు అన్యాయం జరిగితే...గంటలోనే పార్టీ కీలక నేత రాంరెడ్డి దామోదరరెడ్డి వస్తారని, రెండు గంటల్లో తానూ వస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. అవకాశవాదులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీ శ్రేణులు దిగులు పడాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.