byసూర్య | Thu, Jul 07, 2022, 04:26 PM
హజ్ క్రతువులో భాగంగా హజ్ యాత్రికులు గురువారం మినా సిటీకి చేరుకున్నారు. ఈ రోజు అక్కడే బస చేస్తారు. మక్కా సిటీకి 8కి. మీ. దూరంలో మినా సిటీ ఉంది. మినాలో బస చేయడమన్నది హజ్ యాత్రలో చేసే మొట్టమొదటి విధి. రోజంతా ఇక్కడే దైవారాధనల్లో నిమగ్నమవుతారు. రేపు (శుక్రవారం) అరఫాత్ మైదానానికి చేరకుంటారు. మక్కాకు 20కి. మీ. దూరంలో అరఫాత్ మైదానం ఉంది. అరఫాత్ లో జొహర్, అసర్ నమాజు చదువుతారు.
ప్రపంచ నలుమూలల ఈ ఏడాది పదిలక్షల మంది హజ్ యాత్ర చేస్తున్నారు. గత రెండేళ్ల కరోనా సంక్షోభం వల్ల విదేశీ యాత్రికులకు అనుమతి లేదు. ఈ ఏడాది అనుమతి లభించడంతో వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చారని హజ్ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. గత ఏడాది కేవలం 60వేల మంది మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. ప్రస్తుతం మక్కా నగరంలో 42డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 35కి. మీ. వేగంతో వడగాల్పులు వీస్తున్నాయని శాఖ తెలిపింది. 230ఆసుపత్రులు హజ్ యాత్రికుల ప్రథమ చికిత్సకోసం ఏర్పాటు చేశారు. మక్కా, మదీనా పరిసరాల్లో వేల సంఖ్యలో హెల్త్ వర్కర్లు సిద్ధంగా ఉన్నారు. ఎండ వేడిమినుండి రక్షణకోసం యాత్రికులు గొడుగులను ఉపయోగిస్తున్నారు.