అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు రైలు కింద పడి మృతి
byసూర్య |
Tue, May 17, 2022, 04:41 PM
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు రైలు కింద పడి మృత్యువాత పడిన ఘటన మాసాయిపేట మండలం బొమ్మారం రైల్వే గేటు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ దినపత్రికలో తెలిపిన వివరాల మండలంలోని నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన అట్టెం ప్రవీణ్కుమార్ (22) తండ్రి యాదగిరితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి తల్లి శ్యామల గతంలో మృతిచెందింది. దీంతో తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. ప్రవీణ్కుమార్ ఆదివారం ఇదే గ్రామానికి చెందిన ఓ మిత్రుడి ఇంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. సోమవారం తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రవీణ్కుమార్ విగతజీవిగా బొమ్మారం రైల్వేగేటు, బంగారమ్మ ఆలయం మధ్యన రైలు పట్టాలపై రైల్వే సిబ్బందికి కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి రైల్వేపోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని రోదించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్య ఈ ఘటన జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని రైల్వేపోలీసులు వివరించారు.
Latest News