byసూర్య | Mon, May 16, 2022, 12:20 PM
వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ అందించింది. బీహార్ నుంచి చత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వివరించింది. 1500 మీటర్ల ఎత్తున ఈ ఉపరితల ద్రోణి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వివరించింది. కనీస ఉష్ణోగ్రతలు కంటే అదనంగా మూడు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం కూడా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. మహబూబ్నగర్లో అత్యధికంగా 2.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల విషయంలో ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా అండమాన్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల కదలికలు సోమవారం మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని వివరించింది.