byసూర్య | Sun, May 05, 2024, 08:41 PM
రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి అన్నదాతకు మరింత వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్క్ఫెడ్ను ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని సూచించారు. పెంచిన పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతులవద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు.
ఎకరాకు 8.85 క్వింటాళ్ల జొన్నలే కొనాలని ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితిని విధించింది. పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, ఈ పరిమితిని పెంచాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ తాజాగా ఆదేశాలిచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 1.05 లక్షల ఎకరాల్లో జొన్న పంటను గత అక్టోబరు నుంచి మార్చి వరకూ రబీ సీజన్లో పండించారు.
దాదాపు 14 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మార్క్ఫెడ్ ద్వారా క్వింటా జొన్నలకు రూ.3,180 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి కొనుగోలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని పెంచడం వల్ల ఎకరానికి ప్రతి రైతుకు తప్పనిసరిగా మద్దతు ధర కింద 12 క్వింటాళ్లకు రూ.38,160 అందునుంది.