byసూర్య | Fri, Apr 09, 2021, 04:47 PM
గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి పాఠశాలలు తిరిగి తెరిచే వరకు రూ.2000 ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సాయాన్ని లబ్ధిదారులకు ఏప్రిల్ నెల నుంచే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 1.45 లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి సాయం అందించడానికి నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రేషన్ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రులు అధికారులకు సూచించారు.